రెమాల్ తుఫాను బీభత్సం.. బంగ్లాదేశ్ లో 10 మంది మృతి

by Shamantha N |
రెమాల్ తుఫాను బీభత్సం.. బంగ్లాదేశ్ లో 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ లో రెమాల్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా దాదాపు 10 మంది చనిపోయారు. అక్కడ పరిస్థితులు అధ్వానంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని బంగ్లా అధికారులు తెలిపారు. గంటకు 135 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 19 జిల్లాల్లో దాదాపు 35,000 ఇళ్లు ధ్వంసమైనట్లు విపత్తు నిర్వహణ సహాయ మంత్రి మొహిబ్బూర్ రెహమాన్ తెలిపారు. 1,15,000 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదాలు నివారించేందుకు కొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాదాపు 3 మిలియన్ల మంది అంధకారంలోనే ఉన్నారు. దేశంలోని 10,000 టెలికాం టవర్లకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది మొబైల్ సేవలను కోల్పోయారు. మడ అడవులకు నిలయమైన సుందర్‌బన్స్‌లోని తీర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో మడ అడవులు ముంపునకు గురయ్యాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రజలు ఓపిక పట్టాలని బంగ్లా విద్యుత్, ఇంధనశాఖ మంత్రి నస్రుల్ హమీద్ పేర్కొన్నారు.



Next Story